మే 16 వరకూ సరఫరా: కేంద్రం
న్యూఢిల్లీ, మే8: రెమ్డెసివిర్ ఔషధాన్ని మార్కెట్ చేసే వివిధ కంపెనీలు 53 లక్షల వయల్స్ను ఏప్రిల్ 21 నుంచి మే 16 వరకూ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్-19 రోగుల చికిత్సకోసం ఉపయోగించే ఈ ఔషధాన్ని సమయానుగుణంగా సరఫరా చేయాలంటూ కంపెనీలను ఆదేశించామని, సరఫరా ప్రణాళికను ఆయా రాష్ర్టాలకు తెలియపర్చామని కేంద్ర రసాయనాలశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జైడస్ క్యాడిలా, హెటిరో, మైలాన్, సిప్లా, జూబిలెంట్, డాక్టర్ రెడ్డీస్, సిన్జెన్/సన్ఫార్మాలు ఈ ఔషధాన్ని ఆయా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కోవిడ్ ఉధృతి కారణంగా రెమ్డెసివిర్కు డిమాండ్ భారీగా పెరిగింది. దేశంలో లభ్యతను పెంచేందుకు ఈ ఔషధం, దాని తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలపై ప్రభుత్వం ఇప్పటికే కస్టమ్స్ సుంకాన్ని రద్దుచేసింది. అలాగే ఈ ఇంజెక్షన్ల ఎగుమతిని, తయారీలో వాడే ముడిపదార్థాల ఎగుమతుల్ని నిషేధించింది.
రాష్ర్టాల వద్ద ఇంకా 84 లక్షల డోసులు: కేంద్రం
రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికీ 84 లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, రానున్న 3 రోజుల్లో మరో 53 లక్షల డోసులు పంపిణీ చేస్తామని కేంద్రం శనివారం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17.49 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందజేశామని, వాటిలో 16.7 కోట్ల డోసులను వినియోగించారని పేర్కొంది. లక్షద్వీప్కు సరఫరా చేసిన వ్యాక్సిన్ డోసుల్లో 22.7 శాతం వృథా అయిందని తెలిపింది. దేశంలో ఇదే అత్యధిక వృథా అని పేర్కొంది.