తెలుగు చిత్రసీమలో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ‘మా’ ఎన్నికలకు నగారా మోగింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు, నియమావళిని వివరిస్తూ అధికారిక ప్రకటన జారీచేశారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తామని, అదేరోజు ఫలితాల్ని వెల్లడిస్తామని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఈ ఎన్నికల్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లను స్వీకరించి 30వ తేదిన వాటిని పరిశీలిస్తామని చెప్పారు. అక్టోబర్ 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని కృష్ణమోహన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీచేయాలని సూచించారు. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి యాభై శాతం కంటే తక్కువగా ఈసీ మీటింగ్లకు హాజరైన వారు పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. సీనియర్ సిటిజన్స్కు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాష్రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీలో ఉన్నారు.
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షపదవి కోసం ప్రకాష్రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ ప్రధానంగా సాగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తమ శక్తియుక్తుల్ని మోహరిస్తూ విజయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవలే ప్రకాష్రాజ్ తన ప్యానల్ను ప్రకటించారు. విష్ణు త్వరలో తన ప్యానల్ను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయన ప్యానల్ నుంచి ఎవరు పోటీచేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విష్ణు ప్యానల్లో సీనియర్ నటులు రఘుబాబు, బాబుమోహన్ చేరినట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు పోటీపడనున్నట్లు తెలిసింది. ఈ పదవి కోసం ప్రకాష్రాజ్ ప్యానల్ నుంచి జీవిత, స్వతంత్య్ర అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీపడుతున్నారు.