గజ్వేల్, జూన్ 22 : గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం పంపిణీ చేయనున్న డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈనెల 13న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. 9 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించారు. మున్సిపాలిటీలోని 20వార్డుల్లో నలుగురు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో ప్రతి వార్డులో ఇద్దరు అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. మున్సిపాలిటీ అధికారులు మొత్తం 4106 దరఖాస్తు ఫారాలను దరఖాస్తుదారులకు ఇవ్వగా, వాటిలో 3550 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వార్డుల వారీగా 1వ వార్డులో 239, 2వ వార్డులో 195, 3వ వార్డులో 116, 4వ వార్డులో 126, 5వ వార్డులో 162,6వ వార్డలో148, 7వ వార్డులో 185, 8వ వార్డులో 211, 9వ వార్డులో 165, 10వ వార్డులో 183, 11వ వార్డులో 184,12వ వార్డులో 171, 13వ వార్డులో 174, 14వ వార్డులో 252, 15వ వార్డులో 152, 16వ వార్డులో 220, 17వ వార్డులో 166, 18వ వార్డులో 128, 19వ వార్డులో181, 20వ వార్డులో 192 మంది నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
1250 ఇండ్లకు గాను 3550 దరఖాస్తుల స్వీకరణ…
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఇండ్లు, స్థలాలు లేని నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్లో 1250 ఇండ్లను నిర్మించారు. పేదల కోసం నిర్మించిన ఈ ఇండ్లను అర్హులైన నిరుపేదలకే ఇవ్వాలన్న ఉద్దేశంతో దరఖాస్తులను స్వీకరించారు. ఈ దరఖాస్తులను మరికొద్ది రోజుల్లో ఏడుగురు ప్రత్యేకాధికారుల బృందాలతో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. ఇండ్లు, స్థలాలు ఉన్నవారు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోవద్దని ముందస్తుగానే మంత్రి హరీశ్రావు సూచించారు. ఇండ్ల కోసం ఎలాంటి పైరవీలు చేయవద్దని, దళారులను ఆశ్రయించవద్దని సభాముఖంగా ప్రజలకు ఆయన సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి అర్హులైన వారు ఎక్కువ సంఖ్యలో ఉంటే, అదే ప్రాంతంలో మరిన్ని ఇండ్లను నిర్మించి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధం గా ఉందని మంత్రి వెల్లడించారు. మంత్రి హరీశ్రావు మాటలతో చాలావరకు నిరుపేదలు, అద్దె ఇండ్లలో నివాసం ఉన్నవారే ఇండ్ల కోసం దరఖాస్తులను అధికారులకు అందజేశారు.
అర్హులకే ఇండ్లు అందజేస్తాం..
గజ్వేల్ నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ఇండ్లను నిర్మిస్తున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 1250 ఇండ్లు నిర్మించారు. ఇప్పటికీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో వీటిని పూర్తిగా పరిశీలించనున్నారు. మున్సిపల్ పాలకవర్గం గాని, ఇతర నా యకులు గాని ఎలాంటి పైరవీలు చేయడం లేదని, అసలైన నిరుపేదలకే ఇండ్లు మంజూరు చేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం.త్వరలో ఇండ్లు లేని నిరుపేదలంతా ఇంటి యజమానులు కానున్నారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగానే ఈ ఇండ్ల పంపిణీ, గృహప్రవేశాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్కు మున్సిపాలిటీ పట్టణ ప్రజలందరికీ తరుపున ధన్యవాదాలు
– ఎన్సీ రాజమౌళి, మున్సిపల్ చైర్మన్ గజ్వేల్- ప్రజ్ఞాపూర్