యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వాణీ ఒకరు. ప్రస్తుతం ఈ భామ హిందీలో వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉంది. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ఢిల్లీ సొగసరి తాజాగా తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై నుంచి సెట్స్పైకి వెళ్లనుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో కథానాయిక ఎవరనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. విదేశీ నాయికలతో పాటు పలువురు భారతీయ అగ్ర కథానాయికల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ‘వినయ విధేయ రామా’లో రామ్చరణ్తో కియారా అద్వాణీ జోడీ కట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో ఉన్నారు.