తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు రావడం చాలా అరుదు. దానికితోడు ఇక్కడ కొనసాగింపు అంతగా కలిసి రాలేదు. చిరంజీవి లాంటి హీరోలు చేసిన కూడా ప్రేక్షకులు తిప్పి కొట్టారు. అందుకే మన హీరోలు సీక్వెల్స్ అంటేనే భయపడుతుంటారు. అలాంటిది ఓ దర్శకుడు మాత్రం వరుసగా తన సినిమాలకు కొనసాగింపు కథలు రాస్తూనే ఉన్నాడు. ముందు సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫలితంతో సంబంధం లేకుండా తాను మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అతడే ఓంకార్.
బుల్లితెరపై యాంకర్ గా ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా మారాడు. అప్పుడెప్పుడో 11 సంవత్సరాల కింద జీనియస్ అంటూ ఒక డిజాస్టర్ సినిమా చేసిన ఓంకార్.. 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని రాజుగారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏ ముహూర్తంలో చేశాడో తెలియదు కానీ అప్పటి నుంచి వరుసగా సీక్వెల్స్ చేస్తూనే ఉన్నాడు. రాజు గారి గది 2 ఏకంగా నాగార్జున హీరోగా చేశాడు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా ఫలితం తేడా కొట్టింది. అయినా కూడా రెండు సంవత్సరాల కింద రాజు గారి గది 3 చేశాడు. అవికాగోర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది.
వరుసగా రెండు సీక్వెల్స్ ఫ్లాప్ కావడంతో రాజు గారి గది సిరీస్ కు బ్రేక్ పడ్డట్టే అని అందరూ అనుకున్నారు. కానీ రాజు గారి గది 4 కూడా రెడీగా ఉంది అంటూ ఓంకార్ అనౌన్స్ మెంట్ చేశాడు. కథ సిద్ధంగా ఉందని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత సెట్స్ పైకి వెళ్తాము అంటూ క్లారిటీ ఇచ్చాడు. దానితో పాటు ఒక గ్రామీణ కథ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు ఓంకార్. మొత్తానికి రాజు గారి గదిని వదిలి ఓంకార్ ఎప్పుడు బయటకు వస్తాడో చూడాలి.