మే 20న జూనియర్ ఎన్టీఆర్ 38వ పడిలోకి అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్డేని పురస్కరించుకొని అభిమానులు భారీ హంగామా సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కరోనా వేళ వీటన్నింటికి దూరంగా ఉండాలంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అభిమానులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?
ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. త్వరలోనే కోలుకొని కోవిడ్ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే సేవా కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కాని ఈ సంవత్సరం ఇంటి పట్టునే ఉంటూ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక.
ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మనదేశం కరోనాతో యుద్ధం చేస్తుంది. కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్స్, నర్సులు, ఇతర ఫ్రంట్ టైన్ వారియర్స్కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోచారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి.
మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి.త్వరలో మనదేశం ఈ కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున మనం అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ ఎన్టీఆర్ అంటూ పెద్ద పోస్ట్ పెట్టారు జూనియర్. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డేరోజు ఆయన సినిమాలకు సంబంధించి పలు అనౌన్స్మెంట్లు రానున్నాయని తెలుస్తుంది.