రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు
హోల్సెల్ ధర రూ.5.50
రిటైల్గా రూ.6 నుంచి రూ.7 వరకు విక్రయం
ధరలు పెరుగుతున్నా తగ్గని డిమాండ్
నాగర్కర్నూల్, మే 30 : కోడిగుడ్డు ధర కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఐదేండ్లలో ఎప్పుడూ లేనంతగా రూ.7 ధర పలుకుతున్నది. కరోనా నేపథ్యంలో గుడ్డు పౌష్టికాహారం కావడంతో ప్రజలు కొనుగోలుకు ఎగబడుతున్నారు. రోజుకు సగటున ఒక గుడ్డుకు 5 నుంచి 8 పైసల చొప్పున పెరుగుతూ వస్తున్నది. గత నెల చివరి వారంలో ఒక్క గుడ్డు ధర రూ.4.30 పలకగా, నాలుగు వారాల వ్యవధిలో హోల్సేల్గా రూ.5.60 చేరుకున్నది. రిటైల్గా రూ.6.50.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.7కు చేరి రికార్డు సృష్టించింది. గుడ్ల ధరలు వింటేనే తమ కనుగుడ్లు తేలేస్తున్నారు జిల్లా ప్రజలు.
రికార్డు స్థాయికి చేరిన ధరలు..
ఐదేండ్ల ముందు నుంచి గుడ్డు ధరలను పరిశీలిస్తే గతేడాది, ఈ ఏడాది రికార్డుస్థాయి ధర పలుకుతున్నది. ఎన్నడూ లేనంతగా రిటైల్గా రూ.6 నుంచి రూ.7 అమ్ముతున్నారు. గత నెలలో 100 గుడ్లకు రూ.375 ఉండగా, ప్రస్తుతం రూ.520 చేరిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది సైతం కరోనా లాక్డౌన్లో ఇవే ధరలు ఉండగా, ప్రస్తుతం ఆ ధరను తలదన్నే విధంగా గుడ్డు ధర రికార్డుస్థాయికి చేరి రూ.7లకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి వంద గుడ్లకు రూ.700 చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 10 నుంచి 20 పైసలు పెరిగితే ఆ ధర కనీసం వారం రోజులైనా ఉంటూ పెరుగుతూ తగ్గుతూ ఉండేది.
కానీ ప్రస్తుతం వారం రోజుల్లో ఏకంగా రోజుకు 10 నుంచి 15 పైసల వరకు పెరుగుతున్నది. హోల్సేల్లోనే గుడ్డు ఒక్కంటికి రూ.5.80 వరకు చేరుకున్నది. పెరిగిన గుడ్ల ధరలతో సామాన్యుడిపై పెనుభారం పడింది. గుడ్డుతో పూట గడుస్తుందనుకునే ప్రజలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం హోల్సేల్గా డజన్ గుడ్లకు రూ.65 నుంచి రూ.70 అమ్ముతున్నారు. రిటైల్గా అయితే రూ.70 నుంచి రూ.75కు విక్రయిస్తున్నారు. దీంతో డజన్ గుడ్లను కొనుగోలు చేసే సామాన్యుడు అరడజన్తోనే సరిపెట్టుకుంటున్నాడు. ఉత్తరాది రాష్ర్టాల్లో చలితీవ్రత రోజు రోజుకూ పెరగడంతో అక్కడే డిమాండ్ పెరిగిందని హోల్సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో గుడ్డు ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.