కుత్బుల్లాపూర్/గాజులరామారం, మే27:కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నేటి నుంచి సూపర్ స్ప్రెడర్లకు టీకా అందించేందుకు కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల కార్యాలయం పరిధిలో ముమ్మరం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే జంట సర్కిళ్ల పరిధిలో శానిటేషన్, ఎస్ఎఫ్ఏలు, యూసీడీతో పాటు ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో కలిసి సూపర్స్ప్రెడర్లను గుర్తించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. గాజులరామారం జంట సర్కిల్ పరిధిలో సెలూన్ సిబ్బంది, గ్యాస్ డెలివరీ బాయ్స్, బస్డ్రైవర్లు, కిరాణం, పూలు, పండ్లు, కూరగాయాలు, మాంసాహార దుకాణదారులు, రేషన్డీలర్లు, హమాలీలతో పాటు మెడికల్ సిబ్బంది వంటి వారిని సూపర్స్ప్రెడర్లుగా గుర్తించి వారికి సకాలంలో టీకా వేయించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 7వేల మంది ఉండగా, గాజులరామారం సర్కిల్ పరిధిలో 6వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆయా సర్కిల్ పరిధిలో ఉన్న సూపర్స్ప్రెడర్లకు రోజుకు వెయ్యి చొప్పున మందిని గుర్తించి వారికి టీకా వేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఆయా సర్కిల్ పరిధిలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సర్వే చేపట్టి రెండు వేల మందిని గుర్తించి, వారికి సంబంధించిన ఫోన్నంబర్, ఆధార్కార్డుతో నమోదు చేసుకొని వారికి కూపన్లు అందజేశారు. వీరు గాజులరామారం సర్కిల్ పరిధిలో గాజులరామారం మెయిన్రోడ్డు మహారాజ గార్డెన్లో, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల గ్రామం సరోజిని గార్డెన్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పది రోజుల పాటు టీకా వేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పని చేస్తున్న జర్నలిస్టులకు బాచుపల్లి మండలంలోని ప్రగతినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో టీకా వేసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. జర్నలిస్టులకు వారి సంస్థ నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్నా నేరుగా సెంటర్లో వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్ సెంటర్ల ద్వారా టీకా వేసేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్కిల్ పరిధిలోని సూపర్స్ప్రెడర్లకు ప్రతి రోజూ వెయ్యిమంది చొప్పున గుర్తించి వారికి ఒకరోజు ముందుగానే కూపన్లు అందిస్తున్నాం. నేడు వేసే టీకా కోసం ఇప్పటికే వెయ్యిమందికి కూపన్లు ఇచ్చాం. ఎవరూ ఆందోళన చెందరాదు. ప్రతి ఒక్కరికీ టీకా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.- మంగతాయారు, ఉప కమిషనర్, కుత్బుల్లాపూర్ సర్కిల్
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సూచనల మేరకు ప్రతి ఒక్కరికీ టీకా వేసేందుకు నియోజకవర్గంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు ఉండేవారిని మాత్రమే సూపర్స్ప్రెడర్లుగా గుర్తిస్తూ వారికి టీకా వేసేందుకు ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రతి ఒక్కరికీ టీకా వేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. – కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్