నేడు ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్
భద్రాద్రిలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం
ఖమ్మం/ కొత్తగూడెం/ మణుగూరు, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా, పరిమిత సంఖ్యలో ఆహూతుల మధ్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఉదయం 9 గంటలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జాతీయజెండాను ఎగురవేస్తారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం 8:30 గంటలకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మువ్వన్నెల పతాకాన్ని మేయర్ పునుకొల్లు నీరజ ఎగురవేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. ఉదయం 8:45కు అమరువీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం 9 గంటలకు పతాకావిష్కరణ చేస్తారు.
అభివృద్ధికే ప్రాధాన్యం: రేగా
ఎన్నో అద్భుతమైన పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.