ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, తలలో నాలుకగా, చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు . 40ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, 151 చిత్రాలకు దర్శకత్వం, 54 సినిమాల నిర్మాణం..250 చిత్రాలకు సంభాషణలు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించిన దాసరి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ‘తాతా మనవడు’ సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం …అదే తాతా మనవడు నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎర్రబస్సు’ ముగియడం విషాదకరం. మే 4 న జన్మించిన దాసరి మే 30వ తేదీన కన్నుమూశారు. అయితే దాసరి పుట్టిన రోజైన మే 4ని డైరెక్టర్స్ డే గా దర్శకులు జరుపుకుంటూ వస్తున్నారు.
ప్రాణం ఖరీదు, శారద, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, జ్యోతి, కల్పన, ఆమె కథ, సర్దార్ పాపారాయుడు వంటి సూపర్ హిట్ సినిమాల నిర్మాత…స్వాతి, స్రవంతి, గౌతమి, సీతారామయ్య గారి మనవరాలు,రాజేశ్వరి కళ్యాణం వంటి ఉత్తమ చిత్రాల దర్శకుడు, మహిళాభ్యుదయవాది టి. క్రాంతి కుమార్ జయంతి కూడా నేడే.