తిరువనంతపురం : కేరళలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం జరుగనుంది. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆయన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను మంగళవారం కలిశారు. మంత్రివర్గంలోకి తీసుకున్న 21 మంది జాబితాను అందజేశారు. సీఎంతో పాటు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారానికి ముందు అలప్పుజలోని సీపీఐ(ఎం) అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. కొవిడ్-19 ప్రోటోకాల్ కఠినంగా పాటిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. వేడుకకు కేవలం 50 మంది వరకు ఆహ్వానించారని, వారికి కార్యక్రమంలో పాల్గొనే ముందు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష యూడీఎఫ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరుకామని, వర్చువల్ విధానంలో పాల్గొంటామని పేర్కొంది.