హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి చట్టం పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకువచ్చిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపింది. పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకునేందుకుగాను వారి పదవీ విరమణ వయస్సును 61కి పెంచుతూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 36 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ మధ్య కాలంలో ఉత్తమ వైద్య విధానాల అందుబాటు, మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో జీవన ఆయు ప్రమాణం పెరిగిందని.. ఉద్యోగుల వయస్సు పెరిగే కొద్ది వారి అనుభవం పెరుగుతుందని, ఆ అనుభవాన్ని ప్రభుత్వం మరింత వినియోగించుకునేలా వారి పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.