ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలి. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్. సూపర్ ఉమెన్ కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత దిగిన ఫోటోను షేర్ చేస్తూ తాను సాధించానని సంతోషం వ్యక్తం చేసింది. ఆ ఫోటో, ఆమె పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా నివేదాను అభినందిస్తున్నారు.
నిన్ను కోరి, జై లవ కూడా, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన నివేదా థామస్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది.
చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్లో ప్రత్యేక శిక్షణ పొందారు. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. కాని దానిని విజయవంతంగా పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది నివేదా.