అతని పాటలు శ్రోతల హృదయాల వెంట పరవళ్లు తీస్తాయి. అతని భావాలు స్వచ్ఛతను పొదుగుకొని పొంగులెత్తుతాయి. కొంటెపదాల చిలిపితనం, కలికిదనం కలగలిపిన గీతాలెన్నో ఆ కలం నుంచి జాలువారాయి. సహజత్వం, సౌందర్యం ప్రతిఫలించే సినిమా పాటలకు ఆయన కేరాఫ్ అడ్రస్.దశాబ్దకాలంగా సాహిత్యాభిమానులను అలరిస్తున్న ఆ సినీకవి లక్మ ప్రవీణ్.
సినీగీత రచయిత లక్మ ప్రవీణ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్. తల్లిదండ్రులు సత్యనారాయణ, సులోచన. 1978 ఫిబ్రవరి 15న జన్మించారు. ప్రవీణ్, ఎం.కామ్తో పాటు థియేటర్ ఆర్ట్స్లో ఎంఏ చేశారు. సినీగేయ రచయితగా ఎదగాలన్న సంకల్పం ఇండస్ట్రీవైపు అడుగులు వేయించింది.
‘సరదాగా కాసేపు’ అంటూ..
2010లో వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సరదాగా కాసేపు’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు ప్రవీణ్. ప్రేయసీ ప్రియుల మధ్య విరబూసిన ప్రేమ ఓ పువ్వులా నవ్వితే ఎలా ఉంటుందో చెబుతూ ‘మల్లెనవ్వు బుల్లినవ్వు.. బేలనవ్వు బాలనవ్వు’ అంటూ తొలిపాట రాశారు. ఇలా, మొదటి పాటనే ఎంతో అనుభవజ్ఞుడిలా భావగర్భితంగా రాశారు ప్రవీణ్. ఇదే సినిమాలో ‘మగధీరా సుకుమారా.. మనసారా నినుచేరా’, ‘ఊహలో సుందరా ఊపిరై నన్ను కోరుకో’ .. అనే యుగళగీతాలనూ అందించారు.
ప్రేయసీ ప్రియుల కోసం..
ప్రేమికుల హృదయాలలో సాగే వలపుల లాహిరినీ, తుళ్లిపడే వయసు చేసే వింత గారడినీ వర్ణిస్తూ అనేక ప్రేమపాటలు అందించారు ప్రవీణ్. ‘దేవరాయ’ (2012)లో ‘గుచ్చి గుచ్చి కళ్లలోన తొంగి చూశావే’ అనే శృంగార గీతాన్ని సింగారాలు రంగరించి రాశారు. ఇందులో ‘తడబడి నిన్నే చూస్తున్నా.. అలజడి నీదే అంటున్నా.. జతపడి ప్రేమించేస్తున్నా’ అనే పంక్తులు యువతీ యువకులను హుషారెత్తించాయి. ‘శ్రీమన్నారాయణ’ (2012) చిత్రం కోసం రాసిన ‘చలాకీ చూపుల్తో చూమంతరమేసావే’ పాట లక్మ ప్రవీణ్కు మంచి గుర్తింపునిచ్చింది. ప్రేయసితో జీవితాన్ని పంచుకోవాలనుకునే ప్రియుడి ఆరాటాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ‘తళతళలాడే అందాలే.. తాళికట్టి పొందాలే మిలమిల మెరిసే పరువాలే.. మెట్టలు పెట్టి అడగాలే’ వంటి పంక్తుల్లో పెండ్లికళ తొణికిసలాడుతుంది.
స్నేహం విలువను చాటేలా..‘యుద్ధం’ (2014) చిత్రంలో ‘అతడొక సైన్యం అనిపిస్తాడే.. అతనొక యుద్ధం గెలిపిస్తాడే’ అంటూ నాయకుడి ధీరత్వాన్ని, ఠీవిని చాటి చెప్పారు. ఎవ్వరికీ తలవంచని నైజాన్ని, ఆత్మాభిమానాన్ని కలిగిన కథానాయకుడి తీరును కండ్లకు కట్టారు. అచంచలమైన విశ్వాసంతో సాగే హీరో వేగాన్ని వర్ణించారు. ‘యువతకు మార్గం చూపిస్తాడే.. భవితకు ధైర్యం కల్పిస్తాడే’ వంటి వాక్యాల్లో కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రకటించారు ప్రవీణ్. సన్నివేశానికి తగిన భావావేశాన్ని ఎంతో అందంగా పొదిగారీ పాటలో. ఈ సినిమాలోని అన్ని పాటలూ ప్రవీణ్ కలం నుంచి జాలు వారినవే. అదే ఏడాది వచ్చిన ‘కట్ చేస్తే’ చిత్రంలో స్నేహం విలువను చాటి చెప్పే మరో అద్భుత గీతాన్ని అందించారు. ‘ఏ మేరే దోసితీ.. ఏ మేరే జిందగీ.. ఈ స్నేహబంధమే అల్లింది కాలమే’ అంటూ ఈ పాట సాగుతుంది. ఒకరికొకరు తోడూనీడగా మసలుకుంటూ, కష్టసుఖాలను పంచుకుంటూ ఒకే బాటపై కలిసి ప్రయాణించే స్నేహితుల సమూహం పాడే గీతమిది. ‘ఈ స్నేహమే మా లోకమే ఆ స్వర్గమే మా కోసమే’ అంటూ స్నేహమే జీవితమని, శాశ్వతమనే సందేశాన్నిస్తుంది. ఈ సినిమాలోని అన్ని పాటలూ ప్రవీణ్ రాసినవే.
యువతకు సందేశాలిస్తూ..
బాల్యంలోని అల్లరిని, యవ్వనంలోని బాధ్యతల్ని స్పృషిస్తూ యువతకోసం సందేశాత్మక గీతాలనూ రాశారు. ‘ప్యార్ మే పడిపోయానే’ (2014) సినిమాకోసం రాసిన ‘చిన్నపిల్లలు దైవసమానులు.. చిన్నవయసులో చిలిపిచేష్టలు’ అనే పాట ఎంతో విశిష్టమైంది. మేధావులంతా చిన్నతనంలో అల్లరి పనులు చేస్తూ తిరిగిన వారేనని, పెద్దయ్యాక అందరికీ మార్గదర్శకులయ్యారని చాటుతూ యువత పాడే గీతమిది. అందుకు ఉదాహరణలుగా శ్రీకృష్ణుడు, వాల్మీకి, గాంధీజీ, నేతాజీ, ఎడిసన్, బిల్ గేట్స్, టెండుల్కర్ లాంటివారిని ప్రస్తావించడం బాగుంది.
వర్తమానంలో పనీపాట లేక తిరిగినా, భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తామంటూ యువత తమను తాము సమర్థించుకుంటున్న తీరు ఈ పాటలో కనిపిస్తుంది. పైకి సరదా గీతంలా ఉన్నా గొప్ప సందేశాన్నిచ్చే వాక్యాలు ఎన్నో ఉన్నాయి ఈ పాటలో. తొలిచూపులో ఇరు మనసుల్లో పుట్టిన చిలిపి అల్లరిని, ప్రేమసవ్వడిని కవ్వింపుగా చెబుతూ ‘తను మొన్నే వెళ్లిపోయింది’ (2014) సినిమా కోసం ఓ పాటను అందించారు. ‘తొలిచూపుకే నే పడిపోయా.. ఎందుకని? అసలెందుకని?’ అంటూ ప్రేమికుల మనసు గుసగుసల్నీ, ఊసుల్నీ వివరించారు. ఒకరిపై ఒకరి ప్రేమ ఎంత గాఢమైందో ఈ పాటలో చాటిచెప్పారు.
హుషారు గీతాలతో..
‘లవ్ డాట్ కామ్’ (2014) చిత్రం కోసం ‘నీ దందా ఏందిరా పోపో.. బే! దాదాగిరి ఏందిరా’ అంటూ యువతను హుషారెత్తించే పాటను రాశారు ప్రవీణ్. ఎదురు లేని స్వేచ్ఛతో ప్రేమికులు పాడుకునే వయసు గీతమిది. ప్రేమను అడ్డుకునే శక్తి ఎవకీలేదంటూ, యువత వయసు వేగానికి హద్దే లేదంటారు ఈ పాటలో. వీ30కి పైగా పాటలు రాశారు లక్మ ప్రవీణ్. రాసిన ప్రతీ పాట శ్రోతల హృదయాలకు చేరువైంది. ఎందరినో మెప్పించింది. ముఖ్యంగా యువతను ఎంటర్టైన్ చేసే ఎన్నో పాటలకు ఆయన కలం కేరాఫ్ అడ్రస్ అయ్యింది. సాహిత్యపు విలువలతో కూడిన
సినీ గేయాలకు ప్రవీణ్ కలం చిరునామా అయ్యింది.
-తిరునగరి శరత్ చంద్ర ,6309873682