రాజ్యసభ సభ్యుడు కే ఆర్ సురేశ్ రెడ్డి
కమ్మర్పల్లి, జూన్ 9: సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికే ఆహార భద్రత కల్పించే రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయించి సాగు నీటి సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రం వేగంగా బంగారు తెలంగాణగా మారుతోందన్నారు. పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కమ్యూనిస్టు దేశాలే కార్పొరేట్ వైద్యం వైపు మళ్లుతుంటే కేసీఆర్ మాత్రం ఉచిత వైద్య పరీక్షల ఆలోచన చేయడం పేదలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ప్రజల మనసుల్లో ఇంత భరోసా ఉన్న నాయకుడు మరొకరు లేరన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర, దేశ, జిల్లా అంశాలపై చర్చించానని..ఇక ముందు చర్చిస్తానని అన్నారు. జిల్లాలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేల నాయకత్వంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.