జగిత్యాల : ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. గురువారం స్థానిక మినీ పద్మనాయక కల్యాణ మండపంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో గతేడాదిలాగే రైతులకు అండగా ఉండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 84,339 మంది రైతుల నుంచి రూ.1042 కోట్ల విలువైన 5.52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి అంశంపై జరిగిన చర్చ సందర్భంగా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధులను వెంటనే అందిస్తామని చెప్పారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన అదనపు పనులపై ప్రత్రి గ్రామాన్ని పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అవసరమైన సీఎంకు నివేదిక అందజేసి, అదనపు నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలో నీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుత వానాకాలానికి సంబంధించి రైతులకు రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 1,654 మంది రైతులు మరణించగా.. బాధిత కుటుంబాలకు రూ.82.7 కోట్ల బీమా నిధులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ వినియోగిస్తూ.. పనులు పూర్తి చేశామని, వరద కాలువ నుంచి నిర్మించిన తుముల ద్వారా 2,962 ఎకరాల ఆయకట్టుకు సైతం సాగునీరందించామని చెప్పారు. జిల్లాలో పల్లె ప్రగతి పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పెండింగ్ పనులను ఇప్పుడు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద అదనంగా యూనిట్లు మంజూరు చేశామని, ఇందులో ముఖ్యంగా ల్యాండ్ డెవలప్మెంట్ స్కీం, పశువుల పెంపకం వంటి వాటిపై ప్రజాప్రతినిధులు అర్హులైన వారికి అవగాహన కల్పించి, అమలుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, గ్రంథాలయ సంస్థ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, జడ్పీ సీఈఓ వినోద్కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.