సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో భూ పంచాయతీలు లేకుండా ధరణి పోర్టల్ తో విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి సభల్లో ఆయన మాట్లాడుతూ.. దిగుబడి అధికంగా వచ్చేలా సేద్యం విధానాలు మారాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘గతంలో రైతులు చాలా గోస పడ్డారు. ఒకరిపేరు మీద ఉన్న భూమి మరొకరికి రాసేవారు. రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే పహాణీలో 37 కాలమ్స్ ఉండేవి. పట్టాదారు కాల మ్, అనుభవదారు కాలమ్ ఉండేవి. ఒకవేళ అనుభవదారు, వీఆర్వో ఒక్కటైతే ఇక ఖతమే. ఇట్ల్ల చాలామంది భూములు తారుమారయ్యాయి. అనుభవదారుకిచ్చేది నిజమైతే.. ధర్మమే అయితే హైదరాబాద్లో బంజారాహిల్స్లో కిరాయికిచ్చే ఇండ్లను ఎందుకు రాయరు. రాయాలి కదా. గ్రామాల్లో రైతులు అగ్వకు దొరికినారా. ధరణి తేవాలని ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు ఒర్రెటోళ్లకు ధరణి అంటే తెలిస్తేనా! ఇంతకుముందు వీఆర్వో దొరలుండే. నా పొలం పక్కకు పేద రైతు ఒక రోజు ఏడ్సుకుంటా వచ్చి నాభూమి ఇతరుల పేరు మీద రా సిండని బోరుమన్నడు. ఇప్పుడిలాంటి దందా ఉన్నదా? అదృష్టం కొద్దీ వచ్చింది ధరణి. మంచిగనే ఉన్నది కదా! ఉండాల్నా, తీసేయాల్నా? పక్కా ఉండాలి కదా! రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇదేదందా. మ్యుటేషన్ కాదు. పాస్బుక్కురాదు. రిజిస్ట్రేషన్ కాదు. ఎన్ని మాటలు పడాలి! ఎన్ని తంతెలు ఎక్కాలి! వాడి అయ్య ఆస్తి ఇచ్చినట్లు తిప్పేది. ఇప్పుడుందా దందా? 15 నిమిషాల్లో పట్టా, పాస్బుక్కు, మ్యుటేషన్తో సీటీ కొట్టుకుంటూ ఇంటికి పోతున్నరు. అనేకమైన అనుభవాలు చూశాకే లంచాల బాధల నుంచి విముక్తిచేయాలని ధరణి తెచ్చాం. ధరణి పోర్టల్ తేవడానికి మూడేండ్లు పట్టింది. డబ్బు, ఎనభై మీటింగ్లు జరిగాయి. అందుకే ఎవరూ ఏది మాట్లాడి నా పట్టించుకోవడం లేదు.
రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తయి. మిషన్ భగీరథ పథకాన్ని 11 రాష్ర్టాల వాళ్లు వచ్చి చూసిపోయారు. రాష్ట్రంలో 93.5% మంది చిన్న, సన్నకారు రైతులే. నకిలీ విత్తనాలు అమ్మితే ఎవడైనా సరే సహిం చం. వాడు మనకు పెద్ద శత్రువు. నకిలీ విత్తనాలు అమ్మేవారికి కఠిన శిక్షలు వేయాలని ఆదేశించాం. రైతుబంధు సభ్యులు నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పని చేయాలి. రెండుమూడెకరాలున్న చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదని, అతను ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబం రోడ్డునపడే పరిస్థితి రాకుండా ప్ర పంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా అందిస్తు న్నాం. ప్రసూతికి వెళ్లే మహిళలు ప్రైవేటు దవాఖానల్లో వేలకు వేల ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ బాధలు పోవాలని కేసీఆర్ కిట్ ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయ్యే మహిళలకు అన్నిరకాల వస్తువుల కిట్తోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడికి రూ.12వేలు ఇస్తున్నాం. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 28% నుండి 56 శాతానికి పెరిగాయి. అమ్మఒడి పథకం ద్వారా వాహనంలో ఉచితంగా తీసుకొని వచ్చి ఆపరేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపుతున్నం. ఇవన్నీ చేయడానికి మతం,కులం అవసరం లేదు.
ఎలాంటి దరఖాస్తులు లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు అందడం వల్ల పైరవీకారులే బాధపడుతున్నరు. గ్రామాల్లో ఎలాంటి బాధలు, గొడవలు లేవు. మాటలు చెప్పడం వల్ల లాభం ఉండదు. పనిచేసి మంచి పునాదులు వేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. నాటి సీఎం ఎన్టీఆర్ పెట్టిన రెండురూపాయల కిలోబియ్యం మంచి పథకం. దాంతో రాష్ట్రంలో ఆకలి చావులు చాలావరకు తగ్గినయి. నేడు రూపాయికే ఇస్తున్నం. ఎలాంటి లిమిట్ లేకుండా అందరికీ ఇస్తున్నం. హైదరాబాద్లో దవాఖానలంటే గాంధీ, ఉస్మానియాలే గుర్తుకొస్తయి. త్వరలోనే నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి వస్తయి. కరోనాలాంటి విచిత్రమైన రోగాలు రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
హరితహారంలో నాటిన మొక్కల వల్లనే నేడు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే దారి ఎంతో ఆకర్షణగా కనబడుతున్నది. సిద్దిపేటలో ఎటు చూసినా ఆకుపచ్చగా కనబడుతుంది. మనిషికి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం. సిద్దిపేటలో 90% ఇట్లనే ఉంటుంది. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు మొక్కలు కావాలంటే దొరికే పరిస్థితి లేదు. నర్సరీ కూడా దొరకని దుస్థితి ఉండే. నేడు తెలంగాణలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్నది. మొక్కలను పెంచడమనేది ఏ గ్రామ ప్రజాప్రతినిధి ఆ గ్రామం లో, మండల అధికారి మండలంలో చూసుకోవాలి. తనిఖీలు చేపట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశంకాదు. చెప్పినా వినని వారిపై చర్యలు తీసుకోకతప్పదు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. నా జీవితంలో చేయితోని నేను ఎవరినీ కొట్టలేదు. ప్రేమతోనే చెప్పి విజయం సాధించిన. సర్పంచ్ నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిపై చాలా పెద్ద బాధ్యత ఉన్నది. మీరు లేకుంటే ప్రగతి రాదు. అలాఅని నేల విడిచి సాము చేయకూడదు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పంపకున్నా సరే గ్రామాలకు నిధులు వెళ్లాలని అధికారులకు చెప్పిన. ప్రతి నెలా గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నయి. ఏ గ్రామంలోని పనికి సంబంధించిన నిధులు ఆ గ్రామ ప్రజాప్రతినిధులకే అందజేయాలని పంచాయితీరాజ్ శాఖకు సూచించిన.
పుట్టిన వానికి మరణం తప్పదు. ఒక పద్ధతి ప్రకారం బతికే సమాజం మనది. చనిపోయిన వాళ్లను గౌరవప్రదంగా సాగనంపుతం. కానీ గ్రామంలో భూమి లేని వారి పరిస్థితి చాలా బాధాకరం. అందుకే ప్రతి గ్రామం లో కులం, మతం అనే భేదంలేకుండా అన్నివర్గాలకు ఉపయోగపడేలా సకలసౌకర్యాలతో వైకుంఠధామాలు నిర్మించాలనిచెప్పిన. మొత్తం తెలంగాణలో 90% వైకుంఠధామాలు పూర్తయ్యాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వాలు ఇలాంటివి పట్టించుకోలే.
నర్సింహన్ గవర్నర్ ఉన్నప్పుడు మా కాన్వాయ్లో కొత్త కార్లు కొనాలనే ప్రపోజల్ వచ్చింది. కార్లన్నీ బ్లాక్ కలర్లో ఉండేటివి. అప్పుడు మహేష్ భగవత్ అని ఐజీ సెక్యురిటీస్ ఉండే. ఇప్పుడు రాచకొండ కమిషనర్. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకుండే. అప్పుడు రంగు మార్చుకుని తెల్లగా కార్లను మార్చుకున్నం. గవర్నర్కు ఈ విషయం తెలిసి విచారించిండు. పీసుడు ఉన్నవేంది అంటూ ఆశ్చర్యపోయిండు. అతి జాగ్రత్తగా మన ఆర్థిక పరిస్థితిపై ఆలోచనచేస్తూ ముందడుగు వేస్తున్నాం.
మేడిపల్లి సత్తిరెడ్డిని బావ అని పిలుస్తా. ఇప్పుడే పిలిచి మాట్లాడిన. ఎండకాలం వస్తే ట్రాన్స్ఫార్మర్ల కోసం సబ్స్టేషన్లోనే కూసుండేది. లేకపోతే రైతులు కరెంటోళ్లను కొట్టేవారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం అప్పుడు అంత గోసపడ్డాం. ఒకరోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మా సత్యనారాయణరెడ్డికి ఇప్పించి పంపించా. తెల్లారి మల్లా ట్రాన్స్ఫార్మర్ కాలబెట్టుకొని వచ్చిండు. ‘ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కాలింది? పంటలు ఎండిపోయిన తర్వాత మీరిచ్చి కూడా లాభం లేదు’ అని కరెంటోళ్లను తిట్టిన. కొత్త ట్రాన్స్ఫార్మర్ నేనే నిలబడి ఇప్పిస్తే తీసుకొని పోయిండు. కానీ మళ్లీ కాలిపోయింది. ‘ఇదేంది బావ.. నీ ఒక్క ఊరే ఉందా నాకు? మిగతా ఊరోళ్లు పొట్టుపొట్టు చంపుతరు. ఏంది కథ?’ అని అడిగిన. ‘ఇంటికి 3 హీటర్లున్నయి. నేను చెప్తే ఎవరన్న వింటుర్రా!’ అని అన్నడు. అన్ని హీటర్లనూ ఒకటే సారి చాలూచేస్త్తరు. ట్రాన్స్ఫార్మర్లు బుస్సుమని కాలుతున్నయని చెప్పిండు. ఇద్దరం వెళ్లి అక్కడ పెద్ద మనుషులను పిలిచి ‘హీటర్ మీద వండితే బతుకుతమా? పంట పండితే బతుకుతమా?’ అని అడిగిన. అన్ని ఇండ్లల్లో ఉన్న హీటర్లు తెప్పించిన. 376 హీటర్లు ఆ ఒక్క ఊర్లేనే ఎల్లినయి. వాటన్నింటినీ గ్రామ పంచాయితీకాడ కుప్ప పోసి కాలపెట్టినం. ఇగ తెల్లారి నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ కాలలేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలన్న, సబ్స్టేషన్ కావాలన్న అదేదో బ్రహ్మపదార్థం అన్నట్లు చాలా భయంకరమైనటువంటి పైరవీలుచేసే అవసరం ఉండే. విద్యుత్తు కార్యాలయం చుట్టు తిరిగితే ఎమ్మెల్యేల చెప్పులు అరిగేటేవి. ఇవాళ ఎమ్మెల్యేలు చాలా అదృష్టవంతులు. బిస్కెట్ల కన్న అధ్వాన్నంగా ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి.
రావణాసురుడు వచ్చి సీతమ్మను చెరపట్టి లంకకు తీసుకుపోయిండు. హనుమంతుడు జాడ తెచ్చిండు. లంకలో సీతమ్మ ఉన్నదని చెప్పిండు. యుద్ధానికి రాముడు పోయిండు. అప్పుడు ధర్మయుద్ధం ఉంటుండే. లంగ యుద్ధం ఇప్పటిలా ఉండేది కాదు. వానర సైన్యం కకావికలం అవుతుంటే రాముడు తన రామబాణాన్ని విసరడంతో లంకాసురులు ఖతం అయిపోయిండ్రు. సీతను వెంటేసుకొని రాముడు వస్తున్న సమయంలో సగం ఆయుస్సు ఉన్నోళ్లు రాముడిని అడ్డంఆపారు. మా పరిస్థితి ఏందని అడిగితే. వచ్చే కలియుగంలో ఊరికి ఐదుగురు చొప్పున పుట్టి అందరినీ పీక్కుతినమని చెప్తాడు. వాళ్లే ఇప్పుడు దాపురించిండ్రు. వాళ్లతో జాగ్రత్త సుమా. వీళ్లంతా ప్రతీప శక్తులు. నెగిటివిటీతో బతికే వ్యక్తులు. రౌతు తీయనోడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. వాడిది నెత్తా కత్తా. యాడికెళ్లి వచ్చిండు. ఉద్యమం చేసినోడా. వారి పని కూడా ప్రజలు చూసుకుంటరు.