గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్, మే 7: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలుగ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం, వీడీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నది. గాంధారి మండలకేంద్రంలో జూన్ ఒకటో తేదీ వరకు నిబంధనలతో కూడిన పాక్షిక లాక్డౌన్ విధించినట్లు సర్పంచ్ మమ్మాయి సంజీవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలను, హోటళ్లను తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం దుకాణాల నిర్వహణ చేపట్టాలని, వినియోగదారులు భౌతికదూరం పాటించేలా వ్యాపారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామంలో ప్రతిఒక్కరూ మాస్కు లు ధరించాలని కోరారు. మండలకేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వార సంతను రద్దుచేసినట్లు తెలిపారు. మాస్కు లు ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లాక్డౌన్కు గ్రామస్తులు సహకరించాలని కోరారు.
బీబీపేట్ మండలకేంద్రంతోపాటు మాందాపూర్ గ్రామం లో శుక్రవారం సైతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగింది. కిరా ణా దుకాణాలను ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరిచి ఉంచారు. ప్రజలు బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దవాఖానలు, మెడికల్ షాపులను యథావిధిగా కొనసాగించారు.నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. వ్యాపారులు దుకాణాలను మధ్యాహ్నం రెండు గంటలకే మూసివేశారు. జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తాండూర్, ఆత్మకూర్, బొల్లారం, పోచారం గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది.