మూసాపేట : సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తూ.. వచ్చే జీతం సరిపోక బైక్ దొంగతనాల బాట పట్టాడు. పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. తిరిగి వాహనాలను దొంగిలిస్తూనే ఉన్నాడు.. ఎట్టకేలకు ఈ దొంగ కూకట్పల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి 9బైక్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సురేందర్రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఏపీ, కడప ప్రాంతానికి చెందిన బడి వంశీరెడ్డి అలియాస్ భీమ్రెడ్డి(48) బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉం టూ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ క్యాటరింగ్ కూడా చేస్తున్నాడు.
అయితే వచ్చే జీతం సరిపోక సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో 2017లో సంజీవరెడ్డినగర్ పోలీస్స్టేషన్ పరిధిలో- 3, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో- 4 బైకులు చొరీచేసి అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి తిరిగి రాగానే కూకట్పల్లి పీఎస్ పరిధిలో- 6, కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో- 3 బైకులను దొంగలించాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో శనివారం కూకట్పల్లి వై-జంక్షన్ లో అతడు పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 9ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ నర్సింగరావు, డీఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.