తెలుగు ప్రేక్షకులకు సౌందర్యాభిలాష కాస్త ఎక్కువే. కొత్తందాలకు ఆహ్వానం పలికి ఆదరించడానికి ఎప్పుడూ ముందుంటారు. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్ కలిగిన టాలీవుడ్పై కొత్త కథానాయికలు అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ విజయం సాధిస్తే కెరీర్కు ఇక తిరుగుండదనే ధీమాతో ఉంటారు. ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో వివిధ భాషా కథానాయికలు అరంగేట్రం చేయబోతున్నారు. వీరిలో అదృష్టజాతకులెవరో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే…
విజయ్దేవరకొండ కథానాయకుడిగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. మదర్ సెంటిమెంట్కు బాక్సింగ్ క్రీడా నేపథ్యాన్ని జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నాయిక అనన్య పాండే తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ ‘పతీ పత్ని ఔర్ వో’ చిత్రాలతో బాలీవుడ్లో యువతరానికి చేరువైందీ భామ. తెలుగులో తనకు ‘లైగర్’ చిత్రం శుభారంభాన్ని అందిస్తుందనే విశ్వాసంతో ఉందామె. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది అద్భుత సౌందర్యరాశుల్ని పరిచయం చేసిన సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు తన తాజా చిత్రం ‘పెళ్లిసందడి’లో నవ నాయికకు చోటిచ్చారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కన్నడ సొగసరి శ్రీలీల తెలుగు తెరకు పరిచయమవుతున్నది. తొలి సినిమా విడుదలకాకముందే రవితేజ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందించనున్న చిత్రంలో శ్రీలీల నాయికగా నటించనున్నది.
నాగశౌర్య, అనీష్కృష్ణ కలయికలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో కొత్త హీరోయిన్కు చోటుదక్కింది. ఈసినిమా ద్వారా న్యూజిలాండ్ గాయని షిర్లే సేతియా హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ‘బ్లఫ్మాస్టర్’ అనంతరం హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీగణేష్ కలయికలో ‘గాడ్సే’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. యాక్షన్, సందేశం కలబోతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కేరళ సొగసరి ఐశ్వర్య లక్ష్మీ తెలుగులో తొలి అడుగు వేయబోతున్నది. పక్కింటి అమ్మాయి తరహాలో సహజమైన అందంతో అలరారే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళ, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. ‘గాడ్సే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది ఐశ్వర్యలక్ష్మీ. మిస్ ఇండియా కంటెస్టెంట్ మీనాక్షీ చౌదరి మొదటి సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, రవితేజ ‘ఖిలాడీ’, అడివిశేష్ ‘హిట్-2’ సినిమాల్లో మీనాక్షీ చౌదరి కథానాయికగా నటిస్తోంది. అడివిశేష్ ‘మేజర్’ సినిమాతో బాలీవుడ్ సొగసరి సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ప్రయాణానికి శ్రీకారం చుడుతోంది.
ఈ సినిమాతో పాటు వరుణ్తేజ్ ‘గని’లోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రంతో ఈ ఏడాది టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది కేతికాశర్మ. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కొవిడ్ కారణంగా వాయిదాపడింది. తొలి సినిమా రిలీజ్ ఆలస్యమైనా కేతికాశర్మకు అదృష్టం మాత్రం బాగానే కలిసివస్తోంది. ప్రస్తుతం నాగశౌర్య ‘లక్ష్య’తో పాటు వైష్ణవ్తేజ్ సరసన ఓ సినిమాను అంగీకరించిందామే. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’తో మోడల్ సాక్షివైద్య టాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నది. ఇలా నవనాయికల ఆగమనంతో ఈ ఏడాది తెలుగు తెర కొంగొత్త అందాలతో కనువిందు చేయనుంది.