ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో మహాసముద్రం ఒకటి. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
చిత్రంలో సిద్ధార్థ్ సాధారణ యువకుడిలా కనిపించనుండగా, చాలాకాలం తరువాత ఆయన నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. కరోనా వలన ఆగిన చిత్ర షూటింగ్ పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మొదలైంది. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైందని శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఇద్దరు మంచి జోష్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం అందించడం ఖాయంగా కనిపిస్తుంది.