కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్.. మమతపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమత తన విరిగిన కాలిని అందరికీ చూపించాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆమె చీర ఎందుకు కట్టుకోవడం? చెడ్డీలు వేసుకుంటే అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది కదా అని అనడం వివాదమవుతోంది. ఒక కాలు కనిపించి, మరో కాలు కనిపించకుండా ఆమె చీర కట్టుకుంటున్నారు. నేనెప్పుడూ ఇలా చీర కట్టుకోవడం చూడలేదు. నీ కాళ్లు చూపించాలని అనుకుంటే చీర ఎందుకు కట్టుకోవడం, చెడ్డీలు వేసుకోవచ్చు కదా అని దిలీప్ ఘోష్ అన్నారు. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో పర్వర్ట్ అంటూ కామెంట్ చేశారు.