న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల తరపున కేంద్రమే వ్యాక్సిన్లను సమీకరించాలని ఆయన కోరారు. రాష్ట్రాలు విడిగా వ్యాక్సిన్ల కోసం ముందుకెళ్లడం కన్నా వ్యాక్సిన్ తయారీ దేశాలను భారత్ సంప్రదిస్తే మనకు బేరమాడే శక్తి లభిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఆయా దేశాలతో దౌత్య పరంగా భారత్ సంప్రదింపులు జరిపే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఇక కొవిడ్-19 వ్యాక్సిన్ల కోసం ఢిల్లీ గ్లోబల్ టెండర్లు పిలుస్తుందని అంతకుముందు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు ఢిల్లీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని బీజేపీ చెబుతోందని తాము అలా చేస్తే ఇక భారత ప్రభుత్వ పాత్ర ఏమిటని సిసోడియా కేంద్రాన్ని నిలదీశారు.