బెంగళూరు: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు పిల్లలకు రూ.50.1 కోట్ల విలువైన ఇంజెక్షన్లు, ఔషధాలు ఉచితంగా అందాయి. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఎన్జీవో సంస్థలు వీటిని ఉచితంగా సమకూర్చాయి. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ముగ్గురు పసి పాపలు బెంగళూరు బాప్టిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒక పాపకు 14 నెలలు, మరో పాపకు 16 నెలలు. ఈ ముగ్గురికి జోల్జెన్స్మా అనే ఖరీదైన జన్యు చికిత్సను ఉచితంగా అందజేశారు. ఇందులో భాగంగా శరీరంలో జన్యు సంకేతాన్ని మార్చగల సామర్థ్యమున్న రూ.16 కోట్ల విలువైన వన్-టైమ్ ఇంజెక్షన్ను ఒక్కొక్కరికి ఇచ్చారు.
ముగ్గురు పిల్లలకు కలిపి రూ.48 కోట్ల విలువైన ఇంజెక్షన్లు లాటరీ వ్యవస్థ ద్వారా తయారీ కంపెనీ ఉచితంగా ఇచ్చిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఒకే వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు బాలికలకు ఒక్కొక్కటి రూ.70 లక్షల (ముగ్గురికి రూ.2.1 కోట్ల ) విలువైన స్పిన్రాజా అనే ఔషధాన్ని కూడా ఇచ్చినట్లు చెప్పారు. డైరెక్ట్ రిలీఫ్ అనే ఎన్జీవో సంస్థ వీటిని ఉచితంగా ఇచ్చిందని, దీంతో మొత్తంగా రూ.50.1 కోట్ల విలువైన మందులు వారికి ఉచితంగా అందాయని వెల్లడించారు. కోట్ల ఖరీదైన ఈ డ్రగ్స్ తయారీకి 8-10 ఏండ్లు పడుతుందన్నారు.