ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే సిఫారసు
అత్యంత సీనియర్కే అవకాశం ఆనవాయితీ
కేంద్రం ఆమోదిస్తే 48వ సీజేఐగా ప్రమాణం
ఏప్రిల్ 23న జస్టిస్ బోబే ్డ పదవీ విరమణ
1983 ఫిబ్రవరి 10
న్యాయవాదిగా నమోదు
2000, జూన్ 27
ఉమ్మడి ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియామకం.
2013 మార్చి 10
నుంచి మే 20 వరకు
ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా బాధ్యతలు
2013 సెప్టెంబర్ 2
ఢిల్లీ హైకోర్టు సీజేగా నియామకం.
2014 ఫిబ్రవరి 17
సుప్రీంకోర్టు జస్టిస్గా బాధ్యతలు.
న్యూఢిల్లీ, మార్చి 24: దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే బుధవారం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేశారు. సంబంధిత వర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి. నిబంధనల ప్రకారం.. సీజేఐ పదవీ విరమణ చేయడానికి నెల రోజుల ముందు తదుపరి సీజేఐ నియామకానికి సం బంధించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఆనవాయితీ. జస్టిస్ బోబ్డే వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమం లో నెల ముందు అంటే బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ పేరును తదుపరి సీజేఐగా ప్రతిపాదిస్తూ బోబ్డే కేంద్రానికి లేఖ రాశారు. లేఖ మరో ప్రతిని జస్టిస్ రమణకు కూడా అందజేశారు. సీనియారిటీ ప్రాతిపాదికన సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ రమణ అత్యంత సీనియర్ న్యాయమూర్తి. దీంతో ఆనవాయితీ ప్రకారం.. న్యాయమూర్తులందరిలో సీనియర్ను సీజేఐగా నియమించాలని బోబ్డే ఈ సిఫారసు చేశారు. జస్టిస్ రమణను సీజేఐగా నియమించాలని నిర్ణయించిన పక్షంలో అందుకు అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. ఆ లేఖను రాష్ట్రపతి ఆమోదిస్తే, ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022, ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఏపీ సీఎం ఫిర్యాదు కొట్టివేత
జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో బుధవారం ఒక వార్తను ఉంచింది. ‘జస్టిస్ రమణపై ఏపీ ముఖ్యమంత్రి 2020 అక్టోబర్ 6న చేసిన ఫిర్యాదుపై అంతర్గతంగా విచారణ జరిపిన మీదట దానిని తిరస్కరించడమైనది. కోర్టు అంతర్గత విచారణలన్నీ గోప్యంగా ఉంచబడుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయటానికి వీలులేదు’ అని పేర్కొంది. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రయోజనం చేకూర్చేలా జస్టిస్ రమణ ఏపీ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏపీ హైకోర్టు సాయపడుతున్నదని ఆరోపిస్తూ సీజేఐ జస్టిస్ బోబ్డేకు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.54 ఏండ్ల తర్వాత తెలుగు వ్యక్తి!
జస్టిస్ సుబ్బారావు తర్వాత జస్టిస్ రమణ
తెలుగంటే ఆయనకు ఎంతో అభిమానం
రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి.. ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. 1967 ఏప్రిల్ 11 వరకూ సీజేఐ పదవిలో ఆయన కొనసాగారు. 54 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మరో తెలుగు వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావడానికి అడుగు దూరంలో ఉన్నారు. ఎంతో మంది తెలుగు వ్యక్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయినప్పటికీ, సీజేఐగా పదోన్నతి పొందలేకపోయారు. ఇప్పుడు ఆ స్థాయికి జస్టిస్ రమణ చేరబోతున్నారు. మరోవైపు, జస్టిస్ రమణకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. తెలుగు రాష్ర్టాల్లో జరిగే కార్యక్రమాలకు తాను హాజరైతే చాలావరకు తెలుగులోనే ప్రసంగించేందుకు ఆయన ఆసక్తి చూపుతారు. తెలుగు కవుల కథానికలు, కవితలను ఉదహరిస్తూ ప్రసంగం చేయడం ఆయనకు అలవాటు. తెలుగు భాషపై మక్కువతో ఢిల్లీలోని తన నివాసానికి తెలుగులోనే పేరు పెట్టుకున్నట్టు ఓ సందర్భంలో ఆయన తెలిపారు. సాహిత్యం, తత్వశాస్ర్తానికి సంబంధించిన రచనలను ఆయన ఇష్టపడుతారు.
రైతు కుటుంబం నుంచి
జస్టిస్ ఎన్వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. లా (న్యాయశాస్త్రం), సైన్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆయన.. కొద్దికాలం జర్నలిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ను మొదలు పెట్టారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొన్నారు. ఏపీ హైకోర్టు, క్యాట్, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసులు వాదించారు. సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, సర్వీస్, ఎలక్షన్లు కేసులను వాదించడంలో పేరొందారు. జూన్ 27, 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. చట్టసభల ప్రతినిధులపై కేసులను సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేయడం-ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ, నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష, ఇండ్లల్లో మహిళలు చేసే పనికి విలువకట్టడం తదితర కేసుల విచారణలో రమణ కీలక పాత్ర పోషించారు.