కోల్కతా, మే 2: మూడు దశాబ్దాలకుపైగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు, కొంతకాలంగా అక్కడ ప్రాభవాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఉనికినే కోల్పోయే పరిస్థితి కనిపిస్తున్నది. తాజా ఫలితాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి (లెఫ్ట్ అనుబంధ పార్టీ ఆర్ఎస్ఎంపీ-ఐఎస్ఎఫ్కు) ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే దక్కింది. 2007లో నందిగ్రామ్లో జరిగిన హింసాత్మక ఘటనలతో 2011ఎన్నికల్లో వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అనంతరం, 2016లోనూ మళ్లీ మమత అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ దశాబ్దకాలంలో కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గిపోయింది. ఆదివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. దీనికి పలు కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థాగతంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడంలో లెఫ్ట్ పార్టీల నాయకత్వం విఫలమవ్వడం, మిత్రపక్షం బంధానికి ప్రాధాన్యతనిస్తూ గట్టి పట్టున్న స్థానాలను సీట్ల సర్దుబాటులో వదులుకోవడం, రాహుల్, ప్రియాంక వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు బెంగాల్ ఎన్నికలకు అంతగా ప్రాధాన్యతనివ్వకపోవడం తదితర కారణాల వల్లే లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి పేలవమైన ప్రదర్శననిచ్చిందన్నారు. ముఖ్యంగా, కేరళలో కత్తులు దూసుకుంటున్న లెఫ్ట్-కాంగ్రెస్.. బెంగాల్లో జట్టు కట్టడం ప్రజలకు ఆ కూటమిపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసిందని, అందుకే కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి ఎక్కువగా పోలైనట్టు అంచనా వేస్తున్నారు. ముస్లిం ఓటుబ్యాంకు కూడా దాదాపుగా తృణమూల్ ఖాతాలోకి వెళ్లినట్టు పేర్కొంటున్నారు. 2006లో బెంగాల్లో కమ్యూనిస్టులకు 50 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉండేది. 2011 నాటికి ఇది 40 శాతానికి, 2016కి 26 శాతానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వామపక్షాలు ఎన్నికల్లో బరిలో దిగాయి. 70 సీట్లను (లెఫ్ట్ 26, కాంగ్రెస్ 44) గెలుచుకున్నాయి.
న్యూఢిల్లీ: తృణమూల్ నుంచి పలువురు నేతలు తమ పార్టీలోకి రావటాన్ని ప్రజలు అంగీకరించలేదని, ఎన్నికల్లో పరాజయానికి అదొక ముఖ్య కారణమని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. ‘ఇటువంటి ఫలితాన్ని ఎంతమాత్రం ఊహించలేదు. ప్రజల నుంచి మాకు లభించిన సమాచారం ప్రకారం పూర్తి భిన్నమైన ఫలితాల్ని మేం ఆశించాం. స్వల్ప తేడాలతో చాలా సీట్లను కోల్పోయాం’ అని పేర్కొన్నారు.