దక్షిణాది చిత్రసీమలో చక్కటి ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది మలయాళీ సుందరి నయనతార. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా వాణిజ్య చిత్రాల్లో మెరిసిన ఈ అమ్మడు ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాల్లో అద్భుతాభినయాన్ని ప్రదర్శిస్తూ సత్తాచాటుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నయనతారకు మంచి డిమాండ్ ఉంది. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో కేవలం దక్షిణాది చిత్రాలకు మాత్రమే పరిమితమైన ఆమె తాజాగా హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…తమిళ అగ్ర దర్శకుడు అట్లీ నిర్దేశకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. ఫక్తు వాణిజ్య అంశాలతో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. దర్శకుడు అట్లీ రాసుకున్న కథలో దక్షిణాది నేపథ్యం ఉంటుందని..అందుకే నాయికగా నయనతారను తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇటీవలకాలంలో దక్షిణాది కథానాయికలు బాలీవుడ్లో సత్తా చాటుతుండటంతో హిందీ అరంగేట్రానికి ఇదే సరైన సినిమా అనే ఆలోచనతో నయనతార ఈ ప్రాజెక్ట్ను అంగీకరించిందని సమాచారం. ప్రస్తుతం నయనతార తమిళంలో మూడు, తెలుగులో ఓ చిత్రంలో నటిస్తోంది.