సినిమా ప్రచారాలకు దూరంగా ఉంటుంది అగ్ర కథానాయిక నయనతార. ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చాలా అరుదైన విషయంగా చెబుతారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ తమిళ టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూనిచ్చింది నయనతార. అందులో తమిళ దర్శకుడు విఘ్నేశ్శివన్తో ప్రేమ, పెళ్లి గురించి తొలిసారి పెదవి విప్పింది. ఈ జంట గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో విఘ్నేశ్శివన్తో తన నిశ్చితార్థం జరిగిందని నయనతార వెల్లడించింది. కొద్ది మంది కుటుంబ సభ్యులే ఆ వేడుకకు హాజరయ్యారని చెప్పింది. పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా అందరిని ఆహ్వానిస్తానని మాటిచ్చింది. విఘ్నేశ్శివన్ తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత కెరీర్ మరింత ఊపందుకుందని, అతని ప్రోత్సాహంతో సినిమాలపరంగా ఉన్నత లక్ష్యాల్ని ఎంచుకున్నానని పేర్కొంది.