టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ
అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్న నాయకులు
మంత్రి అజయ్కుమార్ సమక్షంలో గులాబీ గూటికి..
కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మంత్రి ప్రణాళికలు
ఖమ్మం, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఖమ్మం నగరంలో మంత్రి అజయ్కుమార్ చేపట్టిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్కు ఆకర్షితులవుతున్నారు.. ఇటీవల కాంగ్రెస్, టీడీపీ నుంచి భారీ సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరారు.. వరుస చేరికలతో దాదాపు రెండు పార్టీలు ఖాళీ అయిన పరిస్థితి నెలకొన్నది. దీంతో నగరంలో టీఆర్ఎస్ మరింత బలోపేతమైంది.. మరోవైపు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.. మంత్రి అజయ్ నేతృత్వంలో నగరంలో విజయ బావుటా ఎగురువేసేందుకు సిద్ధమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ నగరంలో చేపట్టిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రెస్ నుంచి అనేకమంది గులాబీ గూటికి చేరారు. దీంతో పార్టీ మరింత బలోపేతమైంది. మరోవైపు గతంలో ఖమ్మానికి ఆయువుపట్టుగా ఉన్న టీడీపీ కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పటికే అనేకమంది టీడీపీ నాయకులు టీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో పెద్దఎత్తున చేరుతుండడంతో నగరంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి, మునిసిపల్ చైర్మన్గా ఒకసారి పనిచేసి, అనేకసార్లు కౌన్సిలర్గా గెలిచిన మాజీ మునిసిపల్ చైర్మన్ రాపర్తి రంగారావుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు కాంగ్రెస్ పార్టీని వీడడం, ఈనెల 2న మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో చేరిన నాటి నుంచి క్రమంగా పార్టీలోకి వలసలు పెరిగాయి. టీడీపీ నుంచి మాజీ కౌన్సిలర్ చిరుమామిళ్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు బండి మణి, నగర మైనార్టీ అధ్యక్షుడు ఇసాక్, మాజీ సర్పంచ్ భూక్యా పాషా, ఇంతియాజ్తో పాటు వైఎస్సార్ నగర్ బాలపేటకు చెందిన అనేకమంది నాయకులు టీఆర్ఎస్లో చేరడంతో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది.
గెలుపు కోసం వ్యూహాలు..
కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడానికి ముందు నుంచే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం, డివిజన్ల వారీగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపించడం వంటివి కార్పొరేషన్ ఎన్నికలకు కలిసి వస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కనుమరుగైంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరడంతో కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీ దూసుకువెళ్తుందనే భావన రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. నగర పరిధిలోని 60 డివిజన్లకు గాను 60 స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపించేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నాయకులను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి భారీగా వలసలు పెరుగతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరికలు ఆపడానికి ప్రయత్నిస్తున్నా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభివృద్ధి వైపే మొగ్గు చూపి టీఆర్ఎస్లో చేరుతున్నారు.