నృత్యకళ ద్వారా ప్రజల ఆలోచనవిధానంలో మార్పును తీసుకురావడమే కాకుండా మూఢనమ్మకాలను చెరిపేయవచ్చని చాటిచెప్పే చిత్రమిదని అన్నారు సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఈ నెల 22న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్లో సంధ్యారాజు పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి…
బాల్యంలోనే నృత్యం పట్ల నాలో ఇష్టం మొదలైంది. ఈ కళ ఔన్నత్యాన్ని గురించి ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజెప్పాలనే ఆలోచనతోనే సినిమాను రూపొందించాం. ఇప్పటివరకు వెయ్యికిపైగా నృత్యప్రదర్శనలిచ్చాను. ఈ వేదికలతో పోలిస్తే సినిమా మాధ్యమం ద్వారా నాట్యకళ పట్ల ఎక్కువమంది ప్రజల్లో అవగాహన కలిగించవచ్చనిపించింది. దర్శకుడు రేవంత్తో ఇదివరకు ఓ లఘు చిత్రం చేశాను. అతడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో నటిస్తూనే నిర్మించాను. నాట్యకళ ద్వారా ఓ అందమైన కథ చెప్పే ప్రయత్నం చేశాం.
గురుశిష్యుల అనుబంధం
నాట్యం అనే కల్పిత ఊరిలో ఈ కథ సాగుతుంది. గురుశిష్యుల అనుబంధంతో పాటు సంప్రదాయ నృత్యాలకు ఉండే పరిమితులు, క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్ల మధ్య ఉండే భేదాలను ఇందులో ఆవిష్కరించాం. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ ఉంటుంది. ఊరి ప్రజల్లో పేరుకున్న మూఢనమ్మకాలను నాట్యం ద్వారా ఓ మహిళ ఎలా చెరిపివేసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు సరైన ప్రోత్సాహం ఉండదు. రాజకీయాలు, నెగిటివిటీ ఎక్కువగా ఉంటాయని ప్రచారం జరుగుతుంటుంది. కానీ అది అబద్దమని ఈ సినిమాతో తెలుసుకున్నా. కంటెంట్ నచ్చడంతో చిరంజీవి, నాగార్జున, రామ్చరణ్తో పాటు చాలా మంది స్టార్స్ ఈ సినిమాకు అండగా నిలిచారు. నాట్యం పట్ల నాకున్న ఇష్టం, తపనను గ్రహించిన కుటుంబసభ్యులు సినిమా చేస్తానంటే కాదనలేదు.
‘యూటర్న్’ రీమేక్లో నటించా.
నటన, నిర్మాణం రెండు బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూ సినిమాను పూర్తిచేయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. గతంలో కొన్ని లఘు చిత్రాలు చేశాను. మలయాళంలో ‘యూటర్న్’ రీమేక్లో నటించా. డబ్బులు, మార్కెట్ లెక్కల కోసం నేను సినిమాలు చేయను. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథాంశాల్లో నటించాలనుంది. అలాంటి సినిమాల కోసం అన్వేషిస్తున్నా.