ఛండీగఢ్ : హర్యానాలో బ్లాక్ ఫంగస్తో ఇప్పటి వరకు 50 మంది మృతి చెందినట్లు ఆ రాష్ర్ట సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మరో 650 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ నుంచి 58 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు సీఎం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుందని, ఆ చికిత్సకు అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 6 వేల వయల్స్ అందుబాటులో ఉన్నాయని, మరో రెండు రోజుల్లో 2 వేల వయల్స్ వస్తాయన్నారు. ఇవే కాకుండా మరో 5 వేల వయల్స్కు ఆర్డర్ చేశామన్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో కొన్ని సడలింపులతో లాక్డౌన్ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వాణిజ్య సముదాయాలు సరిబేసి విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడుస్తాయని తెలిపారు. అయితే విద్యా సంస్థలు మాత్రం జూన్ 15 వరకు తెరిచేదిలేదని వెల్లడించారు. కాగా, రాత్రి కర్ఫ్యూ 10 గంటల నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటిసారి మే 3న వారం రోజులపాటు లాక్డౌన్ విధించారు. అది మే 10న ముగియడంతో 18వ తేదీవరకు పొడిగించారు. అనంతరం దానిని ఈ నెల 31 వరకు మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజాగా మళ్లీ పొడిగించింది.
హర్యానాలో ఇప్పటివరకు 7,53,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23,094 కేసులు యాక్టివ్గా ఉండగా, 7,22,711 మంది బాధితులు కోలుకున్నారు. మరో 8,132 మంది కరోనా వల్ల మరణించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1868 కేసులు కొత్తగా నమోదయ్యాయి.