కోల్కతా: అయిదుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలిచిన బెంగాలీ డైరక్టర్ బుద్దదేవ్ దాస్గుప్తా ఇక లేరు. వయసు సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్లు. కిడ్నీ వ్యాధితో ఆయన చాన్నాళ్లుగా ఇబ్బందిపడుతున్నారు. ప్రఖ్యాత డైరక్టర్ బుద్దదేవ్ దాస్గుప్తా మృతి పట్ల ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. బెంగాల్లో 1980, 1990 దశకాల్లో దాస్గుప్తా ప్యారలెల్ సినిమాకు ప్రాణం పోశారు. బెంగాల్లో సాగిన నక్సల్ ఉద్యమాన్ని కథాంశంగా తీసుకుని ఆయన తీసిన దూరత్వ(1978), గృహజుద్ద(1982), ఆంధీ గలి(1984) సినిమాలు పెద్ద సెన్షేషన్ క్రియేట్ చేశాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అయిదు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు. భాగ్ బహదూర్(1989), చరాచర్(1993), లాల్ దర్జా(1997), మోండో మేయర్ ఉపక్యాన్(2002) కాల్పురుష్(2008) సినిమాలకు ఆయన జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక బెంగాలీలో అనేక సార్లు ఆయన ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నారు. బుద్దదేవ్ దాస్గుప్తా మంచి కవి కూడా. సూట్కేస్, హిమ్జోగ్, గోవిర్ అరలే, కాఫిన్ కింబా, చాతా కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ట కబితా లాంటి కవితలను ఆయన రాశారు.