‘కూతురి ప్రేమ కంటే కులం, పరువు గొప్పదని భావించే తండ్రిగా ప్రతినాయక ఛాయలతో నేను చేసిన పాత్రకు చక్కటి స్పందన లభిస్తోంది.నా కెరీర్కు గేమ్ఛేంజర్గా ఈ సినిమా నిలిచింది’ అని అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుధీర్బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకుడు. మంగళవారం హైదరాబాద్లో నరేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ అవార్డుల కోసం నేను ఈ సినిమా చేయలేదు. నా క్యారెక్టర్ నచ్చి నటించా. పతాక ఘట్టాల్లో నా నటన బాగుందని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇలాంటి పాత్రలు నటులకు అరుదుగా లభిస్తాయి. సెకండ్ ఇన్నింగ్స్లో నేను చేసిన గొప్ప పాత్రల్లో ఇదొకటి. వైవిధ్యమైన నెగెటివ్ పాత్రలకు నేను న్యాయం చేయగలనని నిరూపించింది. కుల అంతరాల వల్ల ఎదురయ్యే అనర్థాల్ని ఆలోచనాత్మకంగా ఆవిష్కరిస్తూ దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ‘నువ్వు, సుధీర్బాబు కలిసి సినిమాకు ప్రాణంపోశారు’ అని కృష్ణగారు సినిమా చూసి ప్రశంసించారు. ఆయన మాటలు వినగానే కన్నీళ్లొచ్చాయి. మహేష్బాబు సినిమా బాగుందని ట్వీట్ చేయడం ఆనందంగా అనిపించింది. నవతరం దర్శకులు వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్కు కొత్త అర్థాన్ని చెబుతున్నారు. వారు నా కోసం మంచి పాత్రల్ని సృష్టిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఏడేళ్ల వయసులో నా నట ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం నా వయసు యాభైఏడేళ్లు. వచ్చే ఏడాదితో నటుడిగా గోల్డెన్జూబ్లీ జరుపుకోబోతున్నా. ప్రస్తుతం అంటే సుందరానికి, హీరో, టక్ జగదీష్, మాస్ట్రోతో పాటు పలు సినిమాలు చేస్తున్నా. ఓ వెబ్సిరీస్లో నటిస్తున్నా’ అని తెలిపారు.