సోషల్మీడియాలో తనపై వస్తున్న వార్తల్ని ఖండించారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి. తాను ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ ఇటీవల ‘రైతన్న’ సినిమా కార్యక్రమంలో ప్రజాగాయకుడు గద్దర్ అన్న మాటల్ని వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ మాటల ఆధారంగా తాను దీనస్థితిలో ఉన్నానంటూ మీడియాలో కథనాలు రావడం ఎంతగానో బాధించిందన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేను కోట్లు సంపాదించా. సిల్వర్జూబ్లీలు జరుపుకొన్న సినిమాలు తీశాను. ఎన్నో ప్రభుత్వాలు సహాయం కోసం ముందుకొచ్చినా తిరస్కరించా. నేను సంపాదించిన దానిలో అవసరానికి సరిపడా దాచుకున్నా. మిగతా డబ్బుల్ని విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాల కోసం ఇచ్చాను. కేవలం మనశ్శాంతి కోసం సిటీకి దూరంగా పల్లెటూరిలో ఉంటున్నా. ఆటోలో రాకపోకలకే ముప్పైవేలు ఖర్చవుతున్నాయి. అలాంటిది నేను ఇంటి అద్దె కట్టుకోలేనా? నా దగ్గర డబ్బు ఉంది. సంతోషంగా ఉన్నాను. నాకు ఏదైనా అవసరం వస్తే పరిశ్రమ పెద్దలతో పాటు ఎంతో మంది సహాయం చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో వార్తలు చూసి నా అభిమానులు ఫోన్లు చేసి దయ చూపిస్తుంటే కన్నీళ్లొచ్చాయి. సోషల్మీడియాలో దయచేసి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దు. నిజాల్ని మాత్రమే చెప్పండి’ అని నారాయణమూర్తి కోరారు.