న్యూఢిల్లీ: వెటర్నరీ సిబ్బంది ఒక కుక్కపై క్రూరంగా దాడి చేసిన ఘటనపై తాను చాలా కలత చెందినట్లు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి ప్రక్షాళన కోసం ఢిల్లీలోని సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆగస్ట్ 1 నుంచి మూసివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ట్వీట్ చేశారు. జంతు సంరక్షణ కేంద్రానికి ఇటీవల ఒక కుక్కను తెచ్చారని, దానికి చికిత్స అందించే క్రమంలో వెటర్నరీ సిబ్బందిలో ఒకరిని అది కరిచిందని మేనకా గాంధీ తెలిపారు. దీంతో ఇద్దరు సిబ్బంది ఆ కుక్కను దారుణంగా కొట్టి హింసించారని, తీవ్ర గాయాలతో అది చనిపోయిందని చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు తనను చాలా కలచివేశాయని మేనకా గాంధీ అన్నారు. జంతు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ ఘటన తమను షాక్కు గురిచేసిందని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఇద్దరు సిబ్బంది అరెస్టయ్యారని, వెళ్లిపోవాలని ఇంచార్జ్ డాక్టర్కు నోటీస్ ఇచ్చామన్నారు. ఈ చర్యలు సరిపోవన్న మేనకా గాంధీ, 40 ఏండ్ల నాటి జంతు సంరక్షణ కేంద్రాన్ని.. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పరంగా పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ మేరకు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆగస్ట్ 1 నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులోని కుక్కలను ఇతర కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు.