న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. కరోనా సమయంలోనూ ఈయన శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొన్నటి వరకు చేసాడు. సెకండ్ వేవ్ ఉధృతంగా మారిన తర్వాత కానీ బ్రేక్ తీసుకోలేదు. అప్పటి వరకు నాన్ స్టాప్ షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈయన ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడింటిలో టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ఇది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.
పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శ్యామ సింగ రాయ్ షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 40 కోట్లకు పైగా బడ్జెట్తో చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దాంతో పాటు అంటే సుందరానికి సినిమాకు కూడా కమిట్ అయ్యాడు నాని. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా ఇలాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న కుర్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూడు సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాకు కూడా నాని కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
వకీల్ సాబ్ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్.. నానితో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఎంసిఏ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇదే. 2017 డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని చూస్తున్నాడు వేణు శ్రీరామ్. ఇప్పటికే ఈయన చెప్పిన లైన్ నానికి కూడా బాగానే నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలోనే ఈ చిత్రం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఎంసిఏ 2 ఎలా ఉండబోతుందో..?