న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం వీరి భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాహుల్తో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఉత్తరాఖండ్ నేత హరీష్ రావత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రియాంక గాంధీ సైతం ఈ భేటీలో ప్రశాంత్ కిషోర్తో మంతనాలు సాగించినట్టు సమాచారం. పంజాబ్ పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్న క్రమంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు ప్రశాంత్ కిషోర్ కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో పంజాబ్ పరిణామాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. పంజాబ్లో పార్టీ నేతల మధ్య వర్గపోరుకు తక్షణమే తెరదించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు సాగిస్తోంది.
ఇక బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాషాయేతర పార్టీలను కలుపుకునిపోయే వ్యూహాలపైనా ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో ఇటీవల ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు, ఎన్సీపీ చీఫ్తో చర్చల సారాంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్తో భేటీ కారణంగానే ప్రియాంక గాంధీ తన యూపీ పర్యటనను వాయిదా వేసుకున్నారని భావిస్తున్నారు.