నియోజకవర్గంలోని విద్యార్థులకు కరోనా పరీక్షలు
వికారాబాద్, మార్చి 23 : వికారాబాద్ నియోజకవర్గంలో మోమిన్పేట, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి, బంట్వారం, వికారాబాద్ మండలాలు ఉన్నాయి. ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ కరోనా టెస్టులు చేస్తున్నారు. మోమిన్పేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 3000 మందికి పరీక్షలు నిర్వహించగా 100 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో 20 మంది విద్యార్థులకు, ఒక టీచర్కు, మంగళవారం 20 మంది సీనియర్ సిటిజన్స్కు పరీక్షలు నిర్వహించారు. బంట్వారం కస్తూర్బాగాంధీ పాఠశాలలో 39 మంది విద్యార్థులకు, వికారాబాద్ రామయ్యగూడ కొత్తగడి ఉన్నత పాఠశాల, మదన్పల్లి ఉన్నత పాఠశాల, సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో పరీక్షలు చేశారు. కోట్పల్లి కస్తూర్బాగాంధీ పాఠశాలలో రెండు రోజులుగా 6నుంచి 10వ తరగతి 141 మందికి పరీక్షలు, ధారూరు కస్తూర్బాగాంధీ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు 50 మందికి, కుక్కింద ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు 150 మందికి, నాగసముందర్ ఉన్నత పాఠశాలలో 34 మంది విద్యార్థులు, 10 ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. మర్పల్లి బాలికల వసతిగృహంలో 25 మందికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. పట్లూర్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని సంబంధిత డాక్టర్ తెలిపారు.