మంచిర్యాల, మార్చి 23, నమస్తే తెలంగాణ : ఏప్రిల్కంటే ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మార్చిలోనే ఎండలు ముదరడంతో.. మున్ముం దు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా యేటా మార్చిలో మామూలు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఏప్రిల్ 15 తర్వాత ఎండ తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మార్చి నెలాఖరు నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం గరిష్ఠంగా 40.4 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ఠంగా 22.7 డిగ్రీలు నమోదయ్యాయి. పగటిపూట 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇళ్ల నుంచి బయటికి వ చ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. గతేడాది మార్చిలో 30 నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ యేడాది మాత్రం మార్చిలో 40 డిగ్రీలకు చే రుతున్నాయి.ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు తగ్గడం లేదు. రాత్రి పూట ఉక్కపోత అధికంగా ఉంటున్నది. ఈ వేసవిలో ఎండ తీవ్రత, పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు..
మార్చి నెలాఖరు ముందే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎం డ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. కూలీలు, రైతులు, కార్యాలయాలు, ఉద్యోగాలకు వెళ్లేవారు వేడిమికి ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు చల్లని పానీయాలు, తర్బూజ, దోసకాయలాంటి వాటిని తీసుకుంటున్నారు. ఉక్కబోత భరించలేక కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఏప్రిల్లో రద్దీగా ఉండే కూలర్ల దుకాణాలు మార్చి నెలాఖరుకు ముందే సందడిగా కనిపిస్తున్నాయి.