ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇక పార్సిల్ స్నానింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.. వీటి ద్వారా బుకింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి పార్సిల్ను తనిఖీ చేయనున్నారు… సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుక్చేసిన పార్సిల్.. దర్భంగా రైల్వేస్టేషన్లో పేలడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్సిల్ బుకింగ్ వద్ద స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు పార్సిల్లో ఉన్నా.. వాటిని గుర్తించే విధంగా ఆధునిక పరిజ్ఞానంతో స్కానింగ్ యంత్రాలను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడానికి ఎస్సీఆర్ అధికారులు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పార్సిల్ బుకింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే కమర్షియల్ విభాగం అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్సిల్ బుకింగ్దారులు ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గ్యాస్బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లుల్లో ఏదో ఒకదానిని అడ్రస్ ప్రూఫ్ కింద పార్సిల్ బుకింగ్కు జత చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఆధార్నంబర్, బ్యాంకు ఖాతాలకు లింకు చేసిన ఫోన్ నంబర్లు ఇవ్వాలి.. అడ్రస్ ప్రూఫ్లు, మోబైల్ నంబర్లు జత చేయని వారి పార్సి ల్ బుకింగ్ను స్వీకరించబడవు.. పార్సిల్ బుక్ చేసే వ్యక్తులు, లేదా సంస్థలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉండా లి.. ఒక వేళ సంస్థల తరపున పార్సిల్ బుకింగ్ చేయాల్సి వస్తే.. ఆయా సంస్థలకు చెందిన అడ్రస్ ప్రూఫ్, మనుగడలో ఉన్న జీఎస్టీ నంబర్, సంస్థ రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు పార్సిల్లో ఏ వస్తువులను సరఫరా చేస్తున్నారు.. అన్న వివరాలను కూడా బుకింగ్ దరఖాస్తు ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రయాణికుల సరుకు రవాణా కోసం రైళ్లలో ఏర్పాటు చేసిన నాలుగు బోగీల్లో మూడు బోగీలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. అందులో పూర్తిగా ప్రైవేటు కాంట్రాక్టర్లు పార్సిల్ బుకింగ్ చేసుకుంటారు. ఈ క్రమంలో ప్రైవేటు పార్సిల్ కాంట్రాక్టర్లకు పార్సిల్ బుకింగ్పై అవగాహన కల్పించనున్నారు. దర్భంగాలో పార్సిల్ పేలిన నేపథ్యంలో రైల్వే అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో పార్సిల్ బుకింగ్కు సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేసి, మెరుగైన పార్సిల్ విధానాన్ని ఏవిధంగా అందుబాటులోకి తీసుకురావాలి..పేలుడు పదార్థాలు రవాణా కాకుండా నివారించడంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి.. తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్, కమర్షియల్ విభాగాధిపతులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని కోణాల్లో క్షణ్ణంగా అధ్యయనం చేసి రైల్వే అధికారులకు రిపోర్టు అందచేయనుంది. అనంతరం పార్సిల్ బుకింగ్లో తీసుకోవాల్సిన మెరుగైన విధానాలను అవలంభించే అంశంపై రైల్వే అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.