న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 1,33,58,805కి పెరిగాయి. కరోనా మొదలైన తర్వాత మొదటిసారిగా యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షల మార్కును దాటింది. ఇది మొత్తం కేసుల్లో 8.29 శాతంగా ఉంది. గతేడాది సెప్టెంబర్ 18న యాక్టీవ్ కేసులు గరిష్ఠంగా 10,17,754 ఉన్నాయి. తాజాగా ఈ రికార్డు11,08,087కు పెరిగింది. రికవరీ రేటు 90.44 శాతానికి పడిపోయింది. తాజాగా 839 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 18 తర్వాత ఇదే గరిష్ఠం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరింది. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 70.82 శాతం అయిదు రాష్ర్టాల్లోనే (మహారాష్ట్ర, చత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ) నమోదయ్యాయి. దీనిలో ఒక్క మహారాష్ట్ర వాటాయే 48.57 శాతం ఉంది.
దేశంలోనే కరోనాతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్లోని 50 జిల్లాల్లో కొవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల బృందాలు తెలిపాయి. జిల్లాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ జరగడం లేదని, హెల్త్కేర్ వర్కర్లకు కొరత ఉందని, కంటైన్మెంట్ చర్యల్లేవని పేర్కొన్నాయి. వైరస్ కట్టడికి ఆయా జిల్లాల్లో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అభిప్రాయపడ్డాయి. ఈ 50 జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి 30, ఛత్తీస్గఢ్లో 11, పంజాబ్ నుంచి 9 ఉన్నాయి. నిపుణుల బృందాల నివేదికల ఆధారంగా కేంద్రం ఆయా రాష్ర్టాలకు లేఖ రాసింది. కొవిడ్ నిబంధనల అమలులో కేంద్ర బృందాలు గుర్తించిన లోపాలను అందులో పేర్కొన్నది.
మహారాష్ట్రలో లాక్డౌన్ విధించడంపై తగిన నిర్ణయాన్ని ఈ నెల 14 తర్వాత తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్డౌన్తో పాటు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం విలేకరులతో రాజేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ అవసరమని సమావేశం అభిప్రాయపడిందని తెలిపారు. మరోవైపు, మహారాష్ట్రలో వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే 55,411 కేసులు నమోదయ్యాయి. 309 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా టీకా డోసుల కొరత కారణంగా ఒడిశాలో దాదాపు 900 వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశారు. టీకా ఉత్సవ్ పేరుతో ఆదివారం నుంచి బుధవారం దాకా దేశమంతా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని పిలుపునిచ్చిన రోజే వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. రాష్ట్రంలో 1,400 కేంద్రాల్లో జరగాల్సిన వ్యాక్సినేషన్ టీకాల్లేక 579 కేంద్రాల్లోనే జరుగుతున్నదని ఒడిశా మంత్రి విజయ్ పాణిగ్రాహి తెలిపారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రాకపోతే సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ఆపాల్సి రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.