గజ్వేల్: పర్యావరణ పరిరక్షణ కోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు. శనివారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు కూర్మయ్యగారి నవీన్రావు, శంభీపూర్ రాజు తదితరులతో కలిసి సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ మాట్లాడుతూ.. కాలుష్యంతో పర్యావరణంలో రోజురోజుకూ మార్పులు జరుగుతున్నాయని, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగానే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపారు. దీని ద్వారా మొక్కలు, పర్యావరణం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతోందన్నారు. పర్యావరణ రక్షణ కోసం గ్రీన్ఇండియా ఛాలెంజ్ సంస్థ కృషి చేస్తుందని వెల్లడించారు.