మృత్యువనే మైదానం.. శత్రువనే అజ్ఞానం/ ఇపుడింటింట ఆక్రోశం… అని కవి తిలక్ ఏ సందర్భంలో రాసుకున్నాడో కానీ ఇప్పుడు దేశంలో అచ్చు అదే పరిస్థితి ఉన్నది. కరోనా రెండో దశ విస్తరణతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. ఆక్సీజన్ కొరత వల్ల కూడా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కలుగులో దాగినా కాటేస్తున్న కరోనాతో మానవ జాతి కకావికలం అవుతున్నది. మన దేశంలో మొదటి దశను జాగ్రత్తగా ఎదుర్కొన్నాం. కానీ రెండవ దశలోనే కరోనా భయానకమైన సవాలు విసురుతున్నది. వరుసగా ఆరవ రోజున, మంగళవారం నాడు కూడా మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న బాధితుల్లో 38 శాతం మన దేశంలోనే ఉన్నారు. మన పొరుగున మహారాష్ట్ర కరోనాను కట్టడి చేయలేకపోతున్నది. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఏదో రూపంలో లాక్డౌన్ విధించవలసిన పరిస్థితి ఏర్పడింది.
మానవత్వంపై విశ్వాసం బలపడేది కష్టకాలంలోనే. మన దేశ దీనావస్థ ఇతర దేశాలను కదిలించింది. మనకు తోడ్పాటు ఇవ్వడానికి మొదట అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఆ దేశంలోని వివిధ వర్గాల నుంచి భారత్పై సానుభూతి వ్యక్తం కావడంతో బైడెన్ ప్రభుత్వం మెత్తపడక తప్పలేదు. యూకే, జర్మనీ తదితర దేశాలు కూడా ఆదుకోవడానికి ముందుకువచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో పోరాడుతూనే ఉన్నాయి. కానీ రాష్ర్టాలకున్న వనరులు తక్కువ. రాష్ర్టాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించాలి. ఆక్సీజన్తోపాటు వైద్య పరికరాలు, ఔషధాలకు లోటు లేకుండా చూడాలి. ఇందుకు విదేశాల నుంచి సహాయం అందేలా చూడాలి.
‘ఊపిరి పీల్చినపుడేమో జననం/ ఊపిరి విడిచినపుడేమో మరణం/ జనన మరణాల మధ్య దూరం/ క్షణం అన్నమాట తెలుసుకోవటం కష్టం’ అని తెలంగాణ వైతాళికుడు దాశరథి మనిషి జీవన సారాన్ని తాత్త్వికంగా చెప్పాడు. దేశంలో మృతుల సంఖ్య లక్షా 95 వేలుగా ఉండటం బాధాకరమే. అయితే కోలుకున్న వారి సంఖ్య భారీగా ఉన్నది. దేశంలో ఇప్పటి వరకు కోటీ డెబ్బయి లక్షల మందికి కరోనా సోకితే, వీరిలో కోటీ 43 లక్షల మంది ఆ వైరస్ను జయించి కోలుకున్నారు. 28 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మందికి ప్రాణాపాయం లేదు. వృద్ధులు, వివిధ రోగాలతో బాధపడుతున్నవారు కూడా బతికి బయటపడిన ఉదంతాలున్నాయి. కరోనా సోకగానే ప్రాణాపాయం పొంచి ఉందని భయపడవద్దు. కరోనా సోకకుండా మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి అన్ని జాగ్రత్తలు పాటిద్దాం. కరోనా సోకినా భయానికి తావివ్వకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అనేకానేక వైరస్లలో కరోనా ఒకటి. కరోనా అజేయమైనదేమీ కాదు. మానవుడే అజేయుడు.