నల్లగొండ : తెలుగు దేశం పార్టీని ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి.. భజన బ్యాచ్ను వెంట తెచ్చుకుని డ్రామాలు ఆడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ షోకాల్డ్ లీడర్లు తెలంగాణ కోసం కొట్లాడలేదన్నారు. అధికారం రాలేదన్న బాధ తప్ప తెలంగాణ అభివృద్ధి మీద కాంగ్రెస్కు సోయి లేదన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డికి పోటీ చేయడం ఇష్టం లేదు. పార్టీ అధిష్టానం బలవంతంగా నిలబెట్టిందని జానారెడ్డి చెప్పారు అని సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలను సాగర్ ప్రజలు నమ్మొద్దు అని సూచించారు. నాగార్జున సాగర్ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. సాగర్ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎంతో కృషి చేశారని, ఆయన కుమారుడు నోముల భగత్ను ఆశీర్వదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.