‘నాంది’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు విజయ్ కనకమేడల. అండర్ట్రయల్ ఖైదీలు ఎదుర్కొనే ఇబ్బందులను కమర్షియల్ పంథాలో ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం చక్కటి వసూళ్లను సాధించింది. తాజాగా విజయ్ కనకమేడల తన తదుపరి చిత్రాన్ని హీరో నాగచైతన్యతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక ఇతివృత్తానికి సస్పెన్స్, థ్రిల్లర్ హంగులను మేళవిస్తూ దర్శకుడు సిద్ధం చేసిన కథకు నాగచైతన్య ఇటీవలే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్పెద్ది ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.