ఖమ్మం ప్రధానాసుపత్రిలోని ఎంసీహెచ్లో కరోనా ప్రత్యేక వార్డు
12 ఏళ్లలోపు వారి కోసం 40 బెడ్లు ఏర్పాటు
యావత్ తెలంగాణలోనే మొట్ట మొదటి కేంద్రం
ప్రారంభించిన రవాణాశాఖ మంత్రి అజయ్
థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి
ఖమ్మం సిటీ, మే 26: కొవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలతో యావత్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణ కారణంగా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. తొందరలోనే థర్డ్ వేవ్ రాబోతున్నదని, అది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందని దేశవిదేశాల వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అజయ్కుమార్, ఖమ్మం కలెక్టర్ కర్ణన్ ముందస్తు రక్షణ చర్యలకు ఉపక్రమించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రాంగణంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో కేవలం చిన్నారుల కోసమే ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 12 ఏళ్ల్లలోపు బిడ్డలకు కరోనా సోకితే లక్షణాల తీవ్రత ఆధారంగా అత్యవసర, సాధారణ వైద్య సేవలు అందించనున్నారు.
170 మంది చిన్నారులకు కొవిడ్..
కొవిడ్ వ్యాప్తికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా ఖమ్మం జిల్లాలో 12 ఏళ్లలోపు ఉన్న 170 మంది కరోనా బాధిత చిన్నారులను జిల్లా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వారిలోని కొందరిని లక్షణాల తీవ్రత ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు తరలించింది. వారు కోలుకుంటున్నారు. కాగా ప్రస్తుత సెకండ్ వేవ్, ఇక ముందు వెంటాడనున్న థర్డ్ వేవ్ నుంచి పసి పిల్లలను కాపాడుకోవాలనే సదుద్దేశ్యంతో ఖమ్మం పెద్దాసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇది యావత్ తెలంగాణలోనే మొదటిది. మొత్తం 40 బెడ్లు కలిగిన వార్డులో అధునాతన వసతులను అందుబాటులో ఉంచారు.
ప్రారంభించిన మంత్రి అజయ్..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసి బిడ్డలకు మెరుగైన రీతిలో కొవిడ్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును మంత్రి అజయ్కుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం వార్డులోని బెడ్లు, ఇతర వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే కాకుండా భవిష్యత్లోనూ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పసి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని భరోసానిచ్చారు.