ఈ నెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువ కథానాయిక నభానటేష్ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఆమె ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారానే గ్లోబల్వార్మింగ్కు అడ్డుకట్టవేయొచ్చని సూచించింది. భూమాతను రక్షించుకోలేకపోతే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రియతమ నాయకుడు కేటీఆర్గారికి మనమంతా జన్మదిన శుభాకాంక్షలందజేస్తూ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పచ్చదనాన్ని విస్తరిస్తూ ఈ భూమిని నివసించడానికి అందమైన ప్రదేశంగా మారుద్దాం. కేటీఆర్గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అందరికి స్ఫూర్తినిస్తూ మీ ప్రయాణం కొనసాగాలి’ అని నభానటేష్ పేర్కొంది.