న్యూఢిల్లీ, జూలై 6: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయ పరిసరాల్లోనే ఈ ఏడాది రథయాత్ర నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కరోనా నేపథ్యంలో రథయాత్రను కేవలం పూరి ఆలయ పరిసరాలకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘నేనూ జగన్నాథుడి భక్తుడినే. పూరికి వెళ్లాలని ఏడాదిన్నరగా అనుకుంటున్నా. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోతున్నా. నీవు (పిటిషనర్) దేవుడిని ప్రార్థించాలనుకుంటే ఇంట్లో ప్రార్థించు’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది రథయాత్రను ఈ నెల 12న నిర్వహించనున్నారు.