కంటోన్మెంట్, ఏప్రిల్ 9: ఎన్నో ఏండ్ల కల సాకారమైంది. పేదల గుడిసెల్లో వెలుగులు విరజిమ్మాయి. చీకట్లలో మగ్గిన జీవితాలకు వెలుగు రేఖలు అందాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సాయన్నల చొరవతో ఎట్టకేలకు మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్లో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో శుక్రవారం మడ్ఫోర్ట్ అంబేద్కర్ గుడిసెలో విద్యుత్ మీటర్ల బిగుంపునకు ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్లు శ్రీకారం చుట్టారు. మీటర్ల ప్రక్రియ మొదలుకావడంతో గుడిసె వాసుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో ఇన్నాండ్లు చీకట్లలో మగ్గిన తమ జీవితాలు వెలుగులతో విరజిమ్మనున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. గతంలో మంత్రి కేటీఆర్ విద్యుత్ మీటర్ల అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి బాధ్యతను అప్పగించారని, దీంట్లో భాగంగానే నేడు మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభిం చామని అన్నారు.