మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల తేదీని వారం రోజుల్లో ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ప్రకాష్రాజ్, మంచు విష్ణు లాంటి అగ్ర నటులతో పాటు జీవితరాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు వంటి అనుభవజ్ఞులు అధ్యక్షబరిలో నిలవబోతుండటంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ‘మా’ సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా మహమ్మారి ఉధృతితో వర్చువల్గా మీటింగ్ను నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్రనటీనటులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని సీనియర్ నటుడు మురళీమోహన్ ఈ సమావేశంలో తెలిపారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి అక్టోబర్ రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటుందో చూసుకొని అప్పుడే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
“మా’ ఎన్నికలను సెప్టెంబర్లోనే నిర్వహించాలని ప్రకాష్రాజ్ విజ్ఞప్తి చేశారు. ‘నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సివుంది. అవసరమైతే మరో వారం సమయం తీసుకొండి. అంతకుమించి పొడిగించాల్సిన అవసరం లేదు’ అని ప్రకాష్రాజ్ పేర్కొన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అసోసియేషన్ మారిపోయిందని సీనియర్ నటుడు మోహన్బాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు ‘మా’ కోసం ఎక్కువ ధరకు భవనాన్ని కొని తక్కువ మొత్తానికి అమ్మేశారని, దానిపై ఎవరూ మాట్లాడకపోవడం బాధిస్తోందని మోహన్బాబు అన్నారు. సభ్యుల వాదోపవాదాలతో వాడివేడిగా ఈ సమావేశం జరిగింది.